
హైదరాబాద్,వెలుగు: జూనియర్ లైన్మెన్ల నియామకాల్లో సర్వీసు లెక్కింపుపై వివరణ ఇవ్వాలంటూ ఎన్పీడీసీఎల్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎస్ఈ, డివిజనల్ ఇంజినీర్కు బుధవారం హైకోర్టు నోటీసులుఇచ్చింది. 2009 నవంబరు 10న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నియమితులైన వారందరికీ ఒకే సీనియారిటీ వర్తింపజేయకపోవడాన్ని సవాల్చేస్తూ 2011లో నియమితులైనవారు హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకే నోటిఫికేషన్ ఆధారంగా 2007లో కొందరు, 2011లో పిటిషనర్లు నియమితులయ్యారని తెలిపారు.
హైకోర్టు తీర్పు ప్రకారం అందరిని 2007లో నియమితులైనవారితో సమానంగా సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని, వేతనాలు, పదోన్నతులు వాటి ఆధారంగా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఎన్పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2007లో ప్రకటించిన ఖాళీల మేరకు పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. అనంతరం 2011లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా పిటిషనర్ల నియామకం జరిగిందని, అందువల్ల అప్పటి నుంచే సర్వీసు ప్రారంభమవుతుందని వెల్లడించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.